మోర్బి, అక్టోబర్ 31: గుజరాత్లోని మోర్బి జిల్లాలో మచ్చు నదిపై చోటుచేసుకొన్న కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షెడ్యూల్ గడువు నాటికి, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి వంతెనను పునఃప్రారంభించాల్సి ఉండగా, అవేవీ పట్టించుకోకుండా తెరిచారు. దాంతో వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రమాద ఘటనలో సోమవారం నాటికి మృతుల సంఖ్య 141కి చేరింది. ఇందులో ఎక్కువగా మహిళలు, పిల్లలే మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. నదిలో కొట్టుకుపోయినవారిని గాలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎయిర్ఫోర్స్, ఆర్మీ, భారత నేవీ సహాయ చర్యలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనలో బీజేపీ ఎంపీ మోహన్ కుందారియా బంధువులు 12 మంది మృతిచెందారు. ఏండ్ల తర్వాత తెరిచినందున ఆదివారం పిక్నిక్కు అక్కడికే వెళ్లారని కుందారియా వెల్లడించారు. మృతుల్లో ఐదుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. అటు.. వంతెన నిర్వహణ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని గుజరాత్ మంత్రి బ్రిజేశ్ మీర్జా తెలిపారు. ఈ కేబుల్ బ్రిడ్జి పునర్నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఓరెవా గ్రూప్నకు అప్పగించినట్టు వెల్లడించిన మోర్బి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్సిన్హా జాలా.. ఆ సంస్థపై కేసు నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.
ఆ బ్రిడ్జిది 143 ఏండ్ల చరిత్ర
ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే పునఃప్రారంభించిన ఈ వంతెనను 1879లో నిర్మించారు. దీని వెడల్పు 1.25 మీటర్లు కాగా, పొడవు 233 మీటర్లు. దర్బార్గద్ ప్యాలెస్, నజర్బాగ్ ప్యాలెస్ను కలిపేందుకు అప్పటి పాలకుడు సర్ వాఘ్జీ ఠాకూర్ దీన్ని నిర్మించారు. బ్రిడ్జికి మరమ్మతులు చేయాల్సి రావటంతో ఈ ఏడాది మార్చిలో దీన్ని మూసేశారు. ఓరెవా కంపెనీకి 15 ఏండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 26న మళ్లీ రీ ఓపెన్ చేశారు.
కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటన నేపథ్యంలో మరమ్మతులు చేపట్టిన కంపెనీ ఓరెవాపై అందరి దృష్టి పడింది. గుజరాత్కే చెందిన ఈ కంపెనీ వాస్తవానికి గోడ గడియారాలు, సీఎఫ్ఎల్ బల్బులు, ఈ-బైక్స్ తయారుచేస్తుంది. నిర్మాణ రంగంలో అసలు అనుభవమే లేదు. అలాంటిది వందేండ్ల బ్రిడ్జి మరమ్మతు బాధ్యతలు దానికి అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. గోడ గడియారాల్లో అజంతా కంపెనీ ఫేమస్. రాఘవ్జీ పటేల్ 50 ఏండ్ల కిందట ఈ కంపెనీని నెలకొల్పారు. ఆర్పాట్ పేరుతోనూ వీళ్లు గోడ గడియారాలు తయారుచేస్తారు.