BJP Leaks | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): గుజరాత్లో డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన జూనియర్ క్లర్కుల రిక్రూట్మెంట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. పరీక్షకు కొన్ని గంటల ముందే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. దీనిపై అక్కడి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకేమీ ఆదేశించలేదు. సిట్ను ఏర్పాటుచేసింది. ఏకంగా యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ను రంగంలోకి దించి 30 మంది నిందితులను అరెస్ట్ చేసింది.
ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ఉండాలని అక్కడి సర్కారు కోరింది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున విపక్షాలు కూడా యాగీ చేయలేదు. అయితే తెలంగాణలో మాత్రం.. పేపర్ లీక్ అనే దుర్మార్గానికి పాల్పడి కూడా, దాంట్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే నానాయాగీ చేస్తున్న బీజేపీ నేతలు.. మరి గుజరాత్లో జరిగిన దానిపై ఏమని సమాధానం చెబుతారు?
హిమాచల్లో 30 పేపర్లు లీక్
హిమాచల్ప్రదేశ్లో ప్రస్తుత కాంగ్రెస్, మునుపటి బీజేపీ ప్రభుత్వాల హయాంలో 30కి పైగా పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. ఉద్యోగాలు, పోస్టులను బట్టి ఒక్కొక్క పేపర్ను రూ.లక్ష మొదలు రెండున్నర లక్షల వరకు అమ్ముకున్నారు. వీటిపై దర్యాప్తునకు సిట్ను ఏర్పాటుచేశారు. విచారణ ముగిసే వరకు అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యకలాపాలను కూడా నిలిపివేశారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జరిగిన పరీక్షలన్నింటినీ రద్దుచేశారు.
యూపీలో దారుణం..
ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేతృత్వంలోని యోగి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2017 నుంచి 2022 మధ్యకాలంలో ఆరు రిక్రూట్మెంట్లకు సంబంధించిన పేపర్లు బయటకు వచ్చాయి. దీంతో పరీక్షలు రద్దు చేశారు. సబ్ఇన్స్పెక్టర్ పోస్టులు మొదలు పవర్ కార్పొరేషన్, బోరుబావుల ఆపరేటర్ల పోస్టులు, టీచర్ ఉద్యోగాలు.. ఇలా పలు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఇక్కడ కూడా సిట్ వేసి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక్కడ పేపర్ లీకేజీల కోసమే గ్యాంగులు కూడా ఉన్నాయి. ఒక్కో పేపర్ను ఒక్కొక్క గ్యాంగు లీక్ చేయడం.. ప్రశ్నపత్రాలను మార్కెట్లో పెట్టి అమ్మడం పరిపాటిగా మారింది.
ఇక్కడ నానాయాగీ
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందంటూ బీజేపీ, కాంగ్రెస్లు యాగియాగి చేస్తున్నాయి. అయితే, ఇక్కడ ప్రశ్నపత్రాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమ్మలేదు. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదు. ఒకరిద్దరు కక్కుర్తి పడడంతో ఒక పొరపాటు జరిగింది. దాన్ని గుర్తించింది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషనే. ఇక్కడ పరీక్షలు జరిగి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంకా పరీక్షలు ప్రిలిమినరీ స్థాయిలోనే ఉన్నాయి.
ప్రభుత్వానికి సమాచారం అందిన వెంటనే సిన్సియర్ అధికారులతో సిట్ వేసింది. బాధ్యులను అరెస్ట్ చేసింది. పారదర్శకతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనేందుకు సిట్ చేస్తున్న దర్యాప్తే ఉదాహరణ. దేశంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక రికార్డులు బద్దలు కొట్టింది. అతి తక్కువ సమయంలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఇక దేశంలో పేపర్ల లీకేజీలు.. ఉద్యోగాలు అమ్ముకోవడం జరుగని ఏకైక కమిషన్ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే.
తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో పేపర్ల లీకేజీపై దర్యాప్తు జరుపుతున్నది. ఇటీవల పదో తరగతి పేపర్ల లీకేజీ అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. కఠిన చర్యలకు ఉపక్రమించింది. బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేయడంతోపాటు, సర్వీసు నుంచి కూడా తొలగించింది. తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు ఈ సంఘటనలు ఉదాహరణ. అయితే, ఇక్కడ దురదృష్టం ఏమిటంటే.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకున్న ప్రతిపక్షాలు లీకేజీలను ప్రోత్సహిస్తున్నాయి.
ప్రశ్నపత్రాలు లీక్ అయితే ప్రభుత్వం దోషిగా నిలబడుతుంది.. మరి అదే స్వయంగా ప్రతిపక్షాలే లీక్ చేస్తే..? దోషులుగా నిలబడ్తాయి. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ చేసిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరును కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు ఖండించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా సిట్ దర్యాప్తును స్వయంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తప్పుపడుతున్నారు. గుజరాత్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో దర్యాప్తు చేయిస్తే మాట్లాడని కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు ఇక్కడ మాత్రం నోరు చించుకుంటున్నారు. ఇదేం తీరు అని బీజేపీ శ్రేణులు సైతం తప్పుపడుతున్నాయి.