(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అది గుజరాత్లోని తాపీ జిల్లా. ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉండే నిజార్ నియోజకవర్గంలోని దోస్వాడా గ్రామంలో వేదాంత కంపెనీకి చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బీజేపీ సర్కారు అనుమతులు ఇచ్చింది. గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 415 ఎకరాలను సేకరించి కట్టబెట్టింది. ఈ కంపెనీ నిర్మాణాన్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు.
ఫ్యాక్టరీలో జింక్ స్మెల్టింగ్ (జింక్ కరిగించి సరఫరా) చేయడమే కారణం. ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వ్యర్థాలు భూమిలో కలిస్తే భూసారం దెబ్బ తింటుందని, తాగునీరు విషంగా మారుతుందని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా లీకేజీ జరిగితే 92 ఆదివాసీ గ్రామాలు, 10 కిలోమీటర్ల పరిధిలోని భూములు, తాగునీరు, వాతావరణం విషపూరితం అవుతాయని సామాజిక కార్యకర్త హరేశ్ కంతి పేర్కొన్నారు. గత ఏడాది 25 వేల మంది నిరసన చేపట్టారని, ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు.
భవిష్యత్తు దుర్భరమే
పంచాయత్ (ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్) యాక్ట్-1996 ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే, ముందుగా గ్రామసభలో చర్చించాలి. మెజారిటీ ప్రజల నిర్ణయాన్ని అమలు చేయాలి. అయితే, వేదాంత కంపెనీ అలాంటి నిబంధనలేవీ పాటించలేదని స్థానిక ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.
మా దగ్గరే ఇలాంటి ఫ్యాక్టరీలు ఎందుకు?
ఆదివాసీల ప్రాంతాల్లోనే ప్రమాదకరమైన ఫ్యాక్టరీలను ఎందుకు నిర్మిస్తున్నారు? మేము భారతీయులం కాదా? మేం చనిపోయినా ఫర్వాలేదా? బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తున్నది?
– రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దిలీప్ కుమార్, దోస్వాడా