(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘ప్రజలందరికీ, అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోం’.. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు చేసిన వాగ్ధానం ఇది. ఆయన చెప్పినట్టే 2018 నాటికి తెలంగాణవ్యాప్తంగా అన్ని ఇండ్లకు సురక్షిత తాగునీటి నల్లా కనెక్షన్లను ఇచ్చారు. ఇది జరిగి నాలుగేండ్లు పూర్తైంది. ఇప్పుడు తమ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న 91.7 లక్షల గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగునీటి నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు తాజాగా గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే తెలంగాణలో ఎప్పుడో సాధ్యమైన ఈ ఫీట్ను అందుకోవడానికి గుజరాత్కు నాలుగేండ్ల సమయం పట్టింది. ఇదీ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు గుజరాత్ మాడల్. కాగా, ‘హర్ ఘర్ జల్’ తమదేనని కేంద్రంలోని మోదీ సర్కారు ఎంత బాకా ఊదుతున్నా.. ఆ పథకానికి ఆది బిందువు మిషన్ భగీరథేనని, గ్రామాల్లో ఇంటింటికీ 100 శాతం శుద్ధమైన తాగునీరు అందిస్తున్న తొలి, అతిపెద్ద రాష్ట్రం తెలంగాణేనని సాక్షాత్తూ నీతిఆయోగ్, పార్లమెంటరీస్థాయీ సంఘం ప్రశంసించింది. దీన్ని ధ్రువపరుస్తూ.. ఈ నెల 3న ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ‘జల్జీవన్’ పురస్కారాన్ని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డికి అందజేశారు.
తెలంగాణలో నీటి సరఫరా ఇలా..
గ్రామాలు: 100 లీటర్లు
పట్టణాలు: 135 లీటర్లు
నగరాలు: 150 లీటర్లు
పథకం వ్యయం: రూ. 45 వేల కోట్లు
రోజుకు విద్యుత్తు వినియోగం 150 మెగావాట్లు
నీటినాణ్యతను పరీక్షించే ల్యాబ్స్ 122
నీళ్లు ఇస్తున్న మొత్తం ఆవాసాలు 23,890
లబ్ధిపొందుతున్న కుటుంబాలు 54 లక్షలు
నీళ్లు అందుతున్న ప్రభుత్వ పాఠశాలలు 22,882
నీళ్లిచ్చే అంగన్వాడీ కేంద్రాలు 27,310
సరఫరాకు ఏటా అవసరమయ్యే జలాలు 68 టీఎంసీలు