GST Collection | వస్తువుల సేవల పన్ను (GST) భారీగా వసూలయ్యాయి. అక్టోబర్ నెలలో రూ.1.72లక్షల కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022 అక్టోబర్లో రూ.1.52లక్షల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది 13శాతం పెరిగాయి. జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రావడం ఇది రెండోసారి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో జీఎస్టీ వసూళ్లు 11శాతం పెరిగి.. రూ.9.92లక్షల కోట్లకు చేరుకుంటున్నట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లకు చేరగా.. అక్టోబర్ 2023లో జీఎస్టీ ద్వారా మొత్తం రూ.1,72,003 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సీజీఎస్టీ రూ.30,062 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.38,171 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.91,315కోట్లు వసూలయ్యాయి. అలాగే, వస్తువుల దిగుమతిపై ఐజీఎస్టీలో రూ.42,127 కోట్లు వసూలయ్యాయి. మొత్తం వసూళ్లు అత్యధికంగా రూ.1.8 లక్షల కోట్ల మార్కును దాటగా.. జీఎస్టీ వసూళ్లలో తొలిస్థానంలో గుజరాత్, రెండోస్థానంలో కర్నాటక నిలిచాయి.