Gujarat | అహ్మదాబాద్: గుజరాత్లో దాదాపు రెండున్నర దశాబ్దాలకుపైగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్ర విద్యార్థులు, నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నది. అక్కడ ఎప్పుడు పోటీపరీక్షలు నిర్వహించినా పేపర్ లీక్ కావడం పరిపాటిగా మారింది. ఎందుకంటే గత 12 ఏండ్లుగా గుజరాత్లో 15 సార్లు పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా గుజరాత్ పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించతలపెట్టిన పరీక్ష పేపర్ కూడా లీక్ అయ్యింది.
ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 2,995 కేంద్రాల్లో పరీక్ష మొదలు కావాల్సి ఉండగా.. పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందే జామ్నగర్లో పేపర్ లీక్ అయ్యింది. దాంతో ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. రాబోయే వంద రోజుల్లో నూతన ప్రశ్నపత్రాలను ముద్రించి పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది.
కాగా, గుజరాత్లో ఇవాళ జరగాల్సిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముంద్రించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచే పేపర్ లీక్ అయ్యింది. ఒడిశాకు చెందిన ప్రదీప్ నాయక్ ఈ పేపర్ లీకేజీలో కీలకపాత్ర పోషించినట్లు తేలింది. ప్రదీప్ నాయక్ సూచన మేరకు హైదరాబాద్కు చెందిన జీత్ నాయక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి గుజరాత్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని తస్కరించి అతనికి చేరవేసినట్లు వెల్లడైంది. దాంతో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్కు చేరుకుని జీత్ నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీకేజీకి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారు.
మొత్తం 1181 పోస్టుల భర్తీ కోసం ఇవాళ జరగాల్సిన జూనియర్ క్లర్క్ పరీక్షకు గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 9.5 లక్షల మంది దరఖాస్తు చేరుకున్నారు. వారిలో దాదాపు ఏడు లక్షల మందికిపైగా ఇవాళ పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. పేపర్ లీక్ అయిన జామ్నగర్లోనే దాదాపు 26 వేల పైచిలుకు అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా అర్ధాంతరంగా పరీక్ష ఆగిపోయింది. కాగా, ఘటనకు సంబంధించి 15 మంది సూత్రధారులను వడోదరలో అరెస్ట్ చేసినట్లు ఏటీఎస్ పోలీసులు తెలిపారు.
కాగా, గుజరాత్లో వరుస పేపర్ లీకేజీ ఘటనలపై దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుజరాత్ ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యం కారణంగానే అక్కడ తరచూ పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించాయి.