న్యూఢిల్లీ, అక్టోబర్ 22: పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి అర్హత మార్కులను ‘జీరో’కు తగ్గించినా.. దేశవ్యాప్తంగా ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో 1700కుపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ, వేలాది సీట్లు ఖాళీగా ఉండిపోవటంతో కేంద్రం కటాఫ్ మార్కుల్ని ఇటీవల జీరోకు తగ్గించిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ‘కటాఫ్ను జీరో చేశాక మూడో రౌండ్ కౌన్సెలింగ్ చేపట్టాం. ఆల్ ఇండియా కోటా కింద 500 సీట్లు, రాష్ర్టాల కోటా కింద మరో 1200 సీట్లు అందుబాటులో ఉండగా, ఇందులో ఒక్క విద్యార్థీ చేరడానికి ఆసక్తి చూపలేదు. ఇవన్నీ నాన్-క్లినికల్ బ్రాంచెస్ అవ్వటం వల్లే విద్యార్థులు ఆసక్తి చూపలేదని భావిస్తున్నాం’ అని అన్నారు. గత ఏడాది కటాఫ్ మార్కుల్ని 40కు తగ్గించినప్పటికీ దేశవ్యాప్తంగా ఎంఎస్, ఎండీ కోర్సుల్లోని 4,400 సీట్లు భర్తీ కాలేదని గణాంకాలు చెబుతున్నాయి.