న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏ అంశంపై అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. ఆదివారం సాయంత్రం పార్లమెంట్ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రియాన్, డీఎంకేకు చెందిన తిరుచి శివతోపాటు 33 పార్టీల నుంచి 40 మందికిపైగా నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు, సలహాలు చాలా విలువైనవని సమావేశానికి హాజరైన వివిధ పార్టీల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆరోగ్యకరమైన, ఫలవంతమైన చర్చ జరుగాలని కూడా ప్రధాని తన ఆకాంక్ష వెలిబుచ్చినట్లు చెప్పారు. కాగా, ఈ సమావేశాల్లో పలు చట్టాలను చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 19న ప్రారంభమయ్యే ఈ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి.