న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వయస్కుల వారికి కరోనా టీకా అందుబాటులోకి రానున్నది. ఇప్పటి వరకు 12 ఏండ్లకు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ అమలవుతున్నది. తాజాగా 5-12 ఏండ్ల వయసు చిన్నారులకు కూడా కరోనా టీకా వేయనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ది చేసిన కోవాగ్జిన్, బయోలాజికల్ ఈ తయారు చేసిన కొర్బెవ్యాక్స్ టీకాలను 5-12 వయసు పిల్లల కోసం ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) గురువారం సమావేశమైంది. 5-12 వయసు పిల్లలకు అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్, కొర్బెవ్యాక్స్ వ్యాక్సిన్లు ఇవ్వడంపై ఈ కమిటీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రెండు టీకాలకు సంబంధించిన సిఫార్సులను డీసీజీఐకి పంపినట్లు చెప్పాయి. అయితే ఈ సిఫార్సులపై డీసీజీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, దీని కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా, దేశీయంగా తయారు చేసిన పిల్లల మూడో కరోనా వ్యాక్సిన్ కొర్బెవ్యాక్స్ను ప్రస్తుతం 12-14 ఏండ్ల వయసు పిల్లలకు ఇస్తున్నారు. బయోలాజికల్ ఈ అభివృద్ది చేసిన కరోనా టీకా వయోజనుల్లో అత్యవసర వినియోగం కోసం డిసెంబర్ 28న డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కండరానికి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ఈ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి 28 రోజులు.