న్యూఢిల్లీ, నవంబర్ 15: దవాఖానల్లో రాత్రి వేళల్లో కూడా మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది. తగిన వసతులు, వైద్య సదుపాయాలు ఉన్న దవాఖానల్లో రాత్రిపూట కూడా పోస్టుమార్టం నిర్వహించవచ్చని పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ‘బ్రిటిష్ కాలంలో తెచ్చిన విధానానికి ముగింపు పలికాం. ఇక నుంచి దవాఖానల్లో ఎప్పుడైనా పోస్టు మార్టం చేయవచ్చు’ అని తెలిపారు. అంతకుముందు ఈ అంశంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నియమించిన సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చింది. ‘పెరిగిన సాంకేతికత, వైద్య సదుపాయాలతో రాత్రి పూట పోస్టుమార్టంలో ఇబ్బందులేమీ ఉండవు. దవాఖానల్లో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయవచ్చు’ అని సూచించింది. అయితే, హత్యలు, ఆత్యహత్యలు, లైంగిక దాడి, కుళ్లిన మృతదేహాలు, అనుమానాస్పద మృతి కేసుల్లో మృతదేహాలకు మాత్రం పగటి పూటే పోస్టుమార్టం నిర్వహిస్తారు.