చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘాటుగా ఒక లేఖ రాశారు. గవర్నర్ పదవి నుంచి తొలగించేందుకు ఆర్ఎన్ రవి అర్హులని అందులో పేర్కొన్నారు. గవర్నర్ పాల్పడిన ఉల్లంఘనల జాబితాను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీని ఏకపక్షంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, గంటల వ్యవధిలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని కూడా ప్రస్తావించారు. ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుందని గుర్తు చేశారు.
కాగా, గవర్నర్ ఆర్ఎన్ రవి తన ప్రమాణాన్ని ఉల్లంఘించారని, రాష్ట్ర ప్రజలకు, ప్రయోజనాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఎం ఎంకే స్టాలిన్ తన లేఖలో ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కోసం వెతుకుతున్న గవర్నర్ను ‘కేంద్రానికి ఏజెంట్’గా మాత్రమే తాము చూస్తామని అందులో పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వంతో గవర్నర్ ‘రాజకీయ యుద్ధం’ చేస్తున్నారని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ కోరిన మేరకు వివరణలు ఇచ్చినప్పటికీ సభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంతో ఆలస్యం చేస్తున్నారని, తద్వారా శాసనసభ విధులకు అవరోధాలు కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. అన్నాడీఎంకే మాజీ మంత్రులపై అవినీతి కేసులకు సంబంధించిన అనుమతులను ఆయన ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.
మరోవైపు గవర్నర్ ఆర్ఎన్ రవి, విభజన వాది అని సీఎం స్టాలిన్ తన లేఖలో ఆరోపించారు. లౌకికవాదంపై ఆయనకు నమ్మకం లేదని, మతంపై వ్యక్తిగత అభిప్రాయాలు చెబుతున్నారని విమర్శించారు. కేవలం హిందూ మతాన్ని కీర్తిస్తున్నారని, తమిళ సంస్కృతిని కించపరుస్తున్నారని, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం పేరు మార్చాలన్న గవర్నర్ సూచన, తమిళనాడుపై ఆయనకున్న ద్వేషాన్ని వెల్లడిస్తోందన్నారు. ‘పరిపాలన సౌలభ్యం’ కోసమే సమాఖ్య రాష్ట్రాల ఏర్పాటు అని పేర్కొన్న ఆయన భారత రాజ్యాంగాన్ని కూడా అవమానించారని ఆరోపించారు.
కాగా, అసెంబ్లీలో చేసిన అధికార ప్రసంగంలో బీఆర్ అంబేద్కర్, పెరియార్, కామరాజ్, అన్నా, కలైంజర్ పేర్లను గవర్నర్ రవి దాటవేశారని, తద్వారా భారతదేశాన్ని కూడా ఆయన అవమానించినట్లు సీఎం స్టాలిన్ విమర్శించారు. అసెంబ్లీ ప్రసంగంలో సామాజిక న్యాయం, సమానత్వం, ద్రావిడ మోడల్ గవర్నెన్స్ల సూచనలను కూడా ఆయన దాటవేసినట్లు దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పదవి నుంచి తొలగించేందుకు ఆర్ఎన్ రవి అర్హులని తన లేఖలో పేర్కొన్నారు. గవర్నర్గా ఆయనను కొనసాగించడం ఆమోదయోగ్యమేనా? కాదా? అన్నది నిర్ణయించే బాధ్యతను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వదిలేశారు. అయితే సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రపతికి రాసిన ఈ లేఖపై రాజ్భవన్ ఇంకా స్పందించలేదు.