Parliament Session | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేయకపోవడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం ఎజెండాను విడుదల చేసింది. సంవిధాన్ సభ నుంచి మొదలుకొని 75 ఏండ్ల భారత పార్లమెంటరీ ప్రస్థానంపై సమావేశాల మొదటిరోజు చర్చ చేపట్టనున్నట్టు వెల్లడించింది. భారత్ సాధించిన ఘనతలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న అంశాలు చర్చకు రానున్నట్టు తెలిపింది. అలాగే రాజ్యసభలో మూడు బిల్లులు, లోక్సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నది. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్ విడుదల చేశాయి.
ఈ జాబితా తాత్కాలికమేనని, మరిన్ని అంశాలను చేర్చే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. 18న పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు మొదలై, 19న వినాయక చవితిని పురస్కరించుకొని నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు కొనసాగే అవకాశముంది. అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలు, దేశం పేరు భారత్గా మార్పు, మహిళా బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు ముందు నుంచీ ప్రచారం జరుగగా కేంద్రం మాత్రం వీటిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజా ఎజెండాపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రత్యేక సమావేశాల్లో పలు బిల్లులను లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. రాజ్యసభలో మూడు బిల్లులు, లోక్సభలో నాలుగు బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తున్నది. వీటిలో ఇప్పటికే రాజ్యసభ ఆమోదించి.. లోక్సభ ఆమోదం కోసం వేచి ఉన్న బిల్లులు కూడా ఉన్నాయి. లోక్సభలో మొత్తం నాలుగు బిల్లులు చర్చకు రానున్నాయి. అడ్వకేట్స్ (సవరణ) బిల్లు- 2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ పీరియాడికల్ బిల్లు-2023లను 03 ఆగస్టు 2023న రాజ్యసభ ఆమోదించింది. లోక్సభ ఆమోదం కోసం వీటిని లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోస్ట్ ఆఫీస్ బిల్లు-2023, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు-2023లను 10 ఆగస్టు 2023న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే వీటిని రాజ్యసభ ఆమోదించలేదు. ఈ రెండు బిల్లులను లోక్సభ, రాజ్యసభలో ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తున్నది. కాగా, రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్లు-2023ను జూలై 27న లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదానికి రానున్నది. మరోవైపు రాజ్యసభలో ప్రవేశపెట్టి ఇప్పటికీ ఆమోదానికి నోచుకోని పోస్టల్ బిల్లు, ఎన్నికల అధికారుల నిమాయక బిల్లులను రాజ్యసభలో చర్చించనున్నట్టు కేంద్రం తెలిపింది.
దేశవ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశమైన పలు బిల్లులపై కేంద్రం మౌనం వహించింది. దేశం పేరు మార్పు, జమిలి ఎన్నికలు తదితర కీలకమైన బిల్లుల గురించి కేంద్రం ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఈ అంశాల ప్రస్తావన ఎజెండాలో తీసుకురాలేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. రహస్య ఎజెండాలో భాగంగానే సాధారణ బిల్లులను ఈ ఎజెండాలో చేర్చిందని చెబుతున్నారు. సాధారణ సమావేశాల్లో కూడా ఆమోదం పొందే అవకాశం ఉన్న ఈ బిల్లుల కోసం ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇటీవల దేశం పేరు మార్పు, జమిలి ఎన్నికల అంశాలను కేంద్రం తెరపైకి తీసుకొచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. గతంలోనూ తొలుత ప్రస్తావించకుండా పలు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియాకు బదులు దేశం పేరును ఇకపై కేంద్రం భారత్గా మారుస్తున్నదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్టే ఇటీవల ముగిసిన జీ20 సమావేశాలకు రాష్ట్రపతి తరఫున పంపించే ఆహ్వాన పత్రికలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటం ఈ వాదనకు బలం చేకూర్చింది. అదే సమయంలో జీ20 సమావేశాల్లో ప్రధాని ముందు ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని బోర్డు ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. అందుకే ఈ బిల్లులను కేంద్రం రహస్య ఎజెండాలో భాగంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈనెల 17న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆయా పార్టీలకు మెయిల్ ద్వారా ఆహ్వానాలు అందించనున్నట్టు పేర్కొన్నారు. 17న సాయంత్రం 4.30 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనున్నట్టు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.