న్యూఢిల్లీ: బంగారం, వెండి కస్టమర్లకు కేంద్ర సర్కారు మళ్లీ షాకిచ్చింది. ఆ ఖరీదైన ఖనిజాలపై దిగుమతి సుంకాన్ని(Import Duty) పెంచేసింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఆరు నుంచి 15 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి సుంకం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి సరఫరాను తగ్గించే ఉద్దేశంతో దిగుమతి సుంకాన్ని పెంచేశారు. పొదుపు చర్యల్లో భాగంగా ఓ ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నియంత్రించుకోవాలని ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశీ మారకం నిల్వలను పెంచుకునే ఉద్దేశంతో ఈ చర్య తప్పదన్నారు. అయితే దీనిలో భాగంగానే మే 13వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ను పెంచేసింది. సుంకాన్ని పెంచడంతో.. ఓవరాల్గా బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతం పెరిగినట్లు అవుతంది.
2025-26 సీజన్లో బంగారం దిగుమతిలో భారత్ ఆల్ రికార్డు సృష్టించింది. 24 శాతం దిగుమతి పెరిగింది. సుమారు 72 బిలియన్ల డాలర్ల వ్యాపారం జరిగినట్లు భావిసత్ఉన్నారు. బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం 10 గ్రాముల బంగారం రూ.లక్షా 55 వేలుగా ఉన్నది. ఇక వెండి కిలో 2 లక్షల 77 వేలుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం అధికంగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో చైనా ఉంది. అయితే ఇండియాలో ఎక్కువ శాతం జ్వలరీ పరిశ్రమ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇదే రీతిలో బంగారం కొనుగోళ్లు చేపడితే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ తెలిపారు.