బెంగళూరు, ఆగస్టు 15 : బీజేపీ పాలిత కర్ణాటకలో ప్రభుత్వం ఏ విధంగా నడుస్తున్నదో సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రులే ఒప్పుకొంటున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే పనిచేయడంలేదని, వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్ల.. అప్పటివరకూ ఎలాగోలా సర్కారును అతి కష్టంమీద నెట్టుకొస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ మేరకు కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అసలేం జరిగింది?
రుణాలు చెల్లించలేని రైతులపై వీఎస్ఎస్ఎన్ అనే బ్యాంకు అధిక పెనాల్టీలు వేస్తున్న విషయాన్ని చన్నపట్నాకు చెందిన ఓ సామాజిక కార్యకర్త మధుస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘మేము ప్రభుత్వాన్ని నడపట్లేదు. కేవలం నెట్టుకొస్తున్నాం అంతే. మరో 7-8 నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటివరకూ ఎలాగోలా ప్రభుత్వం నడవాలి కదా. నాకు ఈ సమస్యలు అన్నీ తెలుసు. సహాకార మంత్రి సోమశేఖర్ దృష్టికి ఈ అంశాన్ని గతంలోనే తీసుకెళ్లా. ఆయనే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దానికి నేనేం చేయగలను?’ అని బదులిచ్చారు. తాజాగా ఈ ఆడియో టేపు బహిర్గతమైంది.
భగ్గుమన్న తోటి మంత్రులు
మధుస్వామి వ్యాఖ్యలపై తోటి మంత్రులు భగ్గుమన్నారు. ‘మధుస్వామి తానొక్కరే తెలివైన వ్యక్తి అని అనుకుంటున్నారు. ముందు ఆ భ్రమలను ఆయన మెదడు నుంచి తీసివేస్తే మంచిది’ అని సోమశేఖర్ అన్నారు. మధుస్వామి పదవికి రాజీనామా చేయాలని ఉద్యానవన శాఖ మంత్రి మునిరత్నా డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వంలో భాగమైన మధుస్వామి క్యాబినెట్లోని ప్రతీ అంశంలో జోక్యం చేసుకుంటారు. అంటే ఈ వ్యవహారంలో (రైతు రుణాల సమస్య) కూడా ఆయనకు భాగమున్నది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అలాంటి వ్యక్తికి ఇలాంటి వ్యాఖ్యలు సరికావు’ అన్నారు.
ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా?
తాజా వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ అధికార బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు కురిపించింది. కర్ణాటకలో నడుస్తున్నది బీజేపీ నిష్క్రియాత్మక ప్రభుత్వమని ఎద్దేవా చేసింది. ‘సీఎం బసవరాజ్ బొమ్మై నిష్క్రియాత్మక పరిపాలన గురించి చెప్పడానికి ఇంత కంటే గొప్ప ఉదాహరణ ఇంకొకటి ఏం ఉంటుంది?’ అని మండిపడింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఇలా భారంగా నెట్టుకురావడం దురదృష్టకరమని ఎద్దేవా చేసింది. మధుస్వామి వ్యాఖ్యలు ప్రభుత్వంపై అసమ్మతితో చేసినవా? లేక, నిస్సహాయుడిగా మారానన్న ఆవేదనతో చేసినవా? తెలియాల్సి ఉన్నదని పేర్కొంది.