లక్నో, నవంబర్ 23: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కాలేజీల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ) ఫార్మసీల్లో మందుల కొరత నెలకొన్నది. వైద్యులు రాసిచ్చిన ప్రిస్కిప్షన్లోని మందులు దొరకాలంటే రోగులు దాదాపు నెల రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తున్నది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సోనియా నిత్యానంద్కు కేజీఎంయూ టీచర్స్ అసోసియేషన్ లేఖ రాసింది.
యూనివర్సిటీ ‘లోకల్ పర్చేజ్’ వ్యవస్థ ద్వారా మందులు పొందడంలో ఆలస్యం నెలకొన్నదని, దీని కారణంగా రోగులతోపాటు 570 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 9 వేల మంది ఇతర సిబ్బంది, 1500 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నది. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా మెడికల్ యూనివర్సిటీ కొనుగోలు చేస్తున్న మందుల నాణ్యతపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మందులు దొరక్కపోవడంతో బయటి మెడికల్ స్టోర్లలో తెచ్చుకోవాల్సి వస్తుందని ఓ రోగి బంధువు పేర్కొన్నారు.
ఆపరేషన్ కోసం డబ్బులు డిమాండ్
లక్నోలోని ఓ ప్రభుత్వ దవాఖానకు చెందిన వైద్యుడొకరు ఓ రోగికి ఆపరేషన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేశ్ పాఠక్ దర్యాప్తునకు ఆదేశించారు. పారా ఏరియాకు చెందిన ఓ మహిళ గర్భాశయ ఆపరేషన్ కోసం స్థానిక దవాఖానకు వచ్చింది. ఆపరేషన్ ఫీజుగా రూ.400 రశీదు ఇచ్చారని, అయితే సర్జరీ చేయాలంటే అదనంగా రూ.5 వేలు ఇవ్వాలని డాక్టర్ డిమాండ్ చేశారని బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.