Election Commissioners | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి హాజరయ్యారు. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధులను కమిషనర్లుగా కమిటీ ఖరారు చేసింది. వీరి ఎంపికను కాంగ్రెస్ నేత వ్యతిరేకించారు. సమావేశం అనంతరం ఆయన కమిషనర్ల నియామక ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తారు.
కేంద్రం ఎన్నికల కమిషనర్ల పేర్లను ఇప్పటికే ఖరారు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఎవరు కావాలనుకుంటే.. వారే ఎన్నికల కమిషనర్లు’ అని పేర్కొన్నారు. ‘కమిటీలో ప్రభుత్వానికి మెజారిటీ ఉంది. దాంతో పేర్లను ఎంపిక చేసుకోవచ్చు. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో కీలక పదవికి నియామకం ఈ పద్ధతిలో జరుగకూడదు. సమావేశానికి పది నిమిషాల ముందు నాకు ఆరు పేర్లు ఇచ్చారు. కాబట్టి ఇంత తక్కువ సమయంలో నేనేం చెబుతాను’ అన్నారు. న్యాయశాఖకు బుధవారం ఆయన లేఖ రాస్తూ అభ్యర్థుల పేర్లు, బయోడేటా సమాచారం కోరితే 212 పేర్లు ఇచ్చారని.. ఇవాళ సమావేశానికి పది నిమిషాల ముందు ఆరు పేర్లను నిర్ణయించారని.. ఇందులో ఇద్దరిని ఎంపిక చేశారన్నారు.
కొత్త చట్టం ప్రకారం.. ఎన్నికల కమిషనర్ను ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, కేబినెట్ మంత్రితో కూడిన కమిటీ నియమించింది. ఇదిలా ఉండగా.. సీఈసీ, ఈసీల నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పాతచట్టం ప్రకారమే సీఈసీ, ఈసీలను నియమించాలని.. సెలక్షన్ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేలా చూడాలని ఏడీఆర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్పై త్వరలోనే సుప్రీంకోర్టు విచారించనున్నది.