న్యూఢిల్లీ, జనవరి 3: సాక్ష్యాల నమోదుతో కూడిన న్యాయపరమైన విచారణలో తప్ప ప్రభుత్వ అధికారులు భౌతికంగా న్యాయస్థానాలకు హాజరుకానక్కర్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులను కోర్టులకు పిలిపించటం, వస్త్రధారణపై వ్యాఖ్యలు చేయటంపై సుప్రీం కోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
అధికారులను కించపరిచేలా మాట్లాడటం, వారి వేషధారణపై వ్యాఖ్యలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కింది కోర్టులను హెచ్చరించింది. కోర్టు ముందు హాజరు కావాలని జారీ చేసే సమన్ల విషయంలోనూ మార్గదర్శకాలు పాటించాలని ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ను బుధవారం విడుదల చేసింది.
ఏకపక్షంగా కోర్టులకు పిలిపించటంలో ప్రభుత్వ అధికారులకు మినహాయింపు ఇవ్వాలని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. మార్గదర్శకాలను దేశంలోని అన్ని కోర్టులు తప్పనిసరిగా అనుసరించాలని ఆదేశించింది. అధికారుల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేయొద్దని, కోర్టు కార్యాలయంలో దుస్తుల కోడ్ను ఉల్లంఘిస్తే తప్ప వారి వస్త్రధారణను కించపరిచేలా వ్యాఖ్యానించొద్దని స్పష్టం చేసింది.
గత ఏడాది ఇద్దరు సీనియర్ అధికారులు హాజరు కావాలని అలహాబాద్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. దీన్ని యూపీ ప్రభుత్వం సవాలు చేసింది. దీనిపై కోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ అధికారులను తరచూ కోర్టులకు పిలిస్తే ప్రజలకు అందించే సేవలకు ఇబ్బందులు తలెత్తుతాయని ధర్మాసనంఅభిప్రాయపడింది. అఫిడవిట్ల ద్వారా సమస్యలను పరిష్కరించే విషయాన్ని ఆలోచించాలని కోర్టులకు సూచించింది.