న్యూఢిల్లీ : హోటల్స్, రెస్టారెంట్లలో కేక్ కట్ చేసి బోర్ కొడుతోందని ఫీల్ అయ్యేవారు ఇక మెట్రో కోచ్లు, స్టేషన్లలో పార్టీ చేసుకోవచ్చు. బర్త్డే వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ వంటి ఈవెంట్లకు మెట్రో కోచ్లు, స్టేషన్లలో ప్రజలను అనుమతించేందుకు నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎన్ఎంఆర్సీ) సన్నద్ధమైంది. మెట్రో ఆక్వా లైన్ను పార్టీలకు అడ్డాగా మార్చేందుకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియను ఎన్ఎంఆర్సీ చేపట్టింది.
మెట్రో చార్జీల ద్వారానే కాకుండా ఇతర మార్గాల్లో రాబడి పెంచుకునేందుకు మెట్రో కోచ్లు, స్టేషన్లలో పార్టీల నిర్వహణకు అనుమతించాలని ఎన్ఎంఆర్సీ యోచిస్తోంది. ట్రైన్ కోచ్లు, స్టేషన్లను సినిమా షూటింగ్లు, యాడ్స్ చిత్రీకరణకూ అనుమతించాలని ఎన్ఎంఆర్సీ నిర్ణయించింది. పార్టీల నిర్వహణలో భాగంగా ప్రతి కోచ్లో 50 మందిని అనుమతిస్తారు. స్టాండీలు, బ్యానర్లు, పూలతో అలంకరణకూ అనుమతి ఉంటుంది.
భద్రతా కారణాల రీత్యా ఎన్ఎంఆర్సీ సిబ్బంది పర్యవేక్షణలోనే క్యాండిల్స్ వెలిగించడం చేపట్టాలనే నిబంధన విధించారు. రైలు నడిచే వేళల్లో రన్నింగ్ కోచ్లను కూడా పార్టీల నిర్వహణకు అనుమతిస్తారు. రాత్రి 11 నుంచి రెండు గంటల వరకూ మిడ్నైట్ పార్టీల కోసం కూడా కోచ్లను బుక్ చేసుకోవచ్చు. ఇక రన్నింగ్ మెట్రో కోచ్లో పార్టీ చేసుకునేందుకు డెకరేషన్ లేకుండా గంటకు రూ 8000 చార్జ్ చేస్తారు. కదలని రైలులో అయితే గంటకు రూ 5000 వసూలు చేస్తారు. రన్నింగ్ ట్రైన్లో డెకరేట్ చేసిన ట్రైన్లో గంటకు రూ 10,000 చార్జ్ చేస్తారు.