శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని జీలం నదిలో గత వారం లభ్యమైన 1200 ఏండ్ల నాటి పురాతన దుర్గాదేవి ప్రతిమను SPS మ్యూజియంలో పెట్టనున్నట్లు స్థానిక ఆర్కియాలజీ అధికారులు తెలిపారు. ఈ ప్రతిమను నిపుణులు పరిశీలించారని, ఇది ఇంచుమించు 7వ లేదా 8వ శతాబ్దానికి చెందినది అయి ఉంటుందని అంచనా వేశారని జమ్ముకశ్మీర్ ఆర్కియాలజీ డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ బేగ్ చెప్పారు.
ఈ విలువైన, పురాతన దుర్గామాత ప్రతిమలో అమ్మవారు రెండు ఆయుధాలు ధరించి ఉన్నదని, ఒక చేతిలో లోటస్, చక్రం ఉన్నాయని, అదేవిధంగా అమ్మవారి తలకు కిరీటం, మెడలో హారం కూడా ఉన్నాయని బేగ్ దుర్గాదేవి ప్రతిమ గురించి వివరించారు. ఈ ప్రతిమ పూర్తిగా నల్లరాయితో చేశారని చెప్పారు. చట్టపరమైన ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత దుర్గాదేవి ప్రతిమను SPS మ్యూజియంలో పెట్టనున్నట్లు బేగ్ తెలిపారు.
దాదాపు 1200 ఏండ్ల క్రితం నాటి ఈ దుర్గాదేవి ప్రతిమ గత నెల 31న శ్రీనగర్లోని పాండ్రేథాన్ వద్ద జీలం నదిలో లభ్యమైంది. నదిలో ఇసుక తోడేందుకు వెళ్లిన కూలీలకు ఈ ప్రతిమ దొరికింది. అయితే ఆ కూలీలు అమ్మవారి ప్రతిమను అమ్మేందుకు ప్రయత్నించారు. అయితే, బుద్గాం పోలీసులు సకాలంలో స్పందించి ఆ ప్రతిమను స్వాధీనం చేసుకున్నారు.