పనాజి, డిసెంబర్ 30: ఒకవైపు కర్ణాటక – మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు కర్ణాటక – గోవా మధ్య డ్యామ్ వివాదం ముదురుతున్నది. మహాదాయి నదిపై కలాసా – బండూరి డ్యామ్ నిర్మాణానికి కర్ణాటక రూపొందించిన డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల గోవాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు నిరసనగా గోవా అసెంబ్లీలోని మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గోవా ప్రజల ఐక్యతను, డ్యామ్ నిర్మాణం పట్ల నిరసనను చాటి చెప్పాలని గోవా విపక్ష నేత యురి అలెమావ్ డిమాండ్ చేశారు. నది నీటిని కర్ణాటకకు మళ్లించే ప్రయత్నాలను అడ్డుకోవడంలో గోవా బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహాదాయి నది కర్ణాటకలో పుట్టి ఆ రాష్ట్రంలో 28.8 కిలోమీటర్లు ప్రవహించి గోవాలోకి చేరుతుంది. గోవాలో 81.2 కిలోమీటర్లు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. గోవా ప్రజల దాహార్తి తీర్చే తల్లి లాంటి మహాదాయి నదిని కర్ణాటకకు మళ్లించే ప్రయత్నంలో భాగంగానే కలాసా – బందూరి డ్యామ్ నిర్మిస్తున్నారని గోవా ఆరోపిస్తున్నది. అయితే, మహాదాయి నీరు వృథాగా సముద్రంలో కలవకుండా కర్ణాటకలోని కరువు ప్రాంతానికి నీరు అందించేందుకు ఈ డ్యామ్ అవసరమని కర్ణాటక వాదిస్తున్నది.