పనాజీ: ఇవాళ గోవా లిబరేషన్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రశంసలు కురిపించారు. కొన్ని శతాబ్దాల క్రితం దేశంలోని ప్రధాన ప్రాంతాలన్నీ మొగలుల పాలనలో ఉండగా, గోవా మాత్రం పోర్చుగల్ పాలనలో ఉండేదని ప్రధాని గుర్తుచేశారు. కానీ, శతాబ్దాలు గడిచినా గోవా తన భారతీయతను మరువలేదని, భారత దేశం కూడా గోవా తమ రాష్ట్రమనే సంగతిని మర్చిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రవర్తన ద్వారా ఈ రాష్ట్ర (గోవా) ప్రజలు ఎంత నిజాయితీపరులో, ప్రతిభావంతులో, ఎలా కష్టపడుతారో దేశం మొత్తం చూసిందని ప్రధాని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన రాష్ట్రం కోసం, ప్రజల కోసం తన ఆఖరి శ్వాస వరకు పోరాడుతాడనే విషయాన్ని మనం మనోహర్ పారికర్ జీవితం ద్వారా చూశామని చెప్పారు. గోవా రాష్ట్రానికి అన్ని అంశాల్లో అగ్రస్థానమేనన్నారు. సుపరిపాలనలో, తలసరి ఆదాయంలో ఇంకా చాలా అంశాల్లో గోవాదే ముందంజ అని ప్రశంసించారు.
అదేవిధంగా గోవాలో సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని ప్రధాని తెలిపారు. గోవాలో అర్హులైన వారిలో 100 శాతం మందికి తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని చెప్పారు. అందుకు గోవా సర్కారును అభినందించారు. గోవా అభివృద్ధి కోసం సీఎం ప్రమోద్ సావంత్ భారీ లక్ష్యంతో పనిచేస్తున్నారని ప్రధాని కొనియాడారు.