పనాజీ : బీజేపీలో చేరితే రూ 40 కోట్లు ఇస్తామని తమ పార్టీ ఎమ్మెల్యేలను కాషాయ పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ చోడాంకర్ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. మాజీ గోవా సీఎం దిగంబర్ కామత్ నేతృత్వంలో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకున్న నేపధ్యంలో కాంగ్రెస్ నేత గిరీష్ బీజేపీపై ఈ ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతూ పారిశ్రామికవేత్తలు, బొగ్గు మాఫియాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని గిరీష్ ఆరోపించారు.
గోవా కాంగ్రెస్ ఇన్చార్జి దినేష్ గుండూరావుతో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ విషయం చెప్పారని గిరీష్ తెలిపారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర చీఫ్ సదానంద్ తనవడే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలతో తమకు సంబంధం లేదని, ప్రలోభాలకు తెరలేపడం వంటి విషయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటని, అలాంటివి తమకు తెలియదని చెప్పుకొచ్చారు.
తమలో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా సోమవారం ఉదయం జరిగిన పార్టీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎమ్మెల్యేలు కాషాయ గూటికి చేరతారనే వార్తలన్నీ ఊహాజనితమని కాంగ్రెస్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో తోసిపుచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వదంతులను తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు.