అమరావతి : పసుపు జెండా చూస్తే సీఎం జగన్ భయపడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుంటుందని విమర్శించారు. 23 మంది ఎంపీలను గెలిపిస్తే జగన్ ప్రత్యేక హోదా తెస్తానన్నారని, ఇప్పుడది ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందని.. మరో అవకాశమిస్తే ఇళ్లను నాశనం చేస్తారని మండిపడ్డారు.