Covid-19 Booster Dose | వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతున్నది. ఇప్పటికీ మెజారిటీ జనాభాకు రెండు డోస్లు పూర్తి కాలేదు. కానీ రెండు డోస్ల వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బూస్టర్ డోస్ అవసరం గురించి చర్చ మొదలైంది. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు కూడా బూస్టర్ డోస్ అవసరమని చెబుతున్నారు. సుదీర్ఘ కాలం ఇమ్యూనిటీని కొనసాగించడానికి, కొత్తగా రూపు మార్చుకుంటున్న వైరస్ మ్యూటెంట్ వేరియంట్లపై పోరాటానికి బూస్టర్ డోస్ అవసరం ఉందని వ్యాక్సిన్ మేకర్లు వాదిస్తున్నారు.
ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో గణనీయ జనాభా రెండు డోస్ల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. అమెరికా, బ్రిటన్ కూడా బూస్టర్ కం థర్డ్ డోస్ గురించి చర్చిస్తున్నాయి. కానీ భారత్లో వైద్య నిపుణులు మాత్రం పాశ్చాత్య దేశాల బాటలో ప్రయాణించాల్సిన అవసరమేమీ లేదని వాదిస్తున్నారు.
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా స్పందిస్తూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు డోస్ల వ్యాక్సిన్లు వేసుకుంటే రోగ నిరోధక శక్తిని సాధించొచ్చునని చెప్పారు. ఇప్పుడు వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో వైరస్ వ్యాపించకుండా, ఇన్ఫెక్షన్ కాకుండా నివారించలేవని మనకు తెలుసు.. కానీ, ఇన్ఫెక్షన్ అయితే, మరణానికి, విషమ పరిస్థితి రాకుండా అడ్డుకుంటాయన్నారు.
పలువురు హెల్త్కేర్ వర్కర్లు, వ్యాక్సిన్లు తీసుకున్న వారు తమలో యాంటీ బాడీలు తక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే శరీన్ చెప్పారు. వ్యాక్సినేషన్తోపాటు ఇతర అంశాలు కూడా యాంటీబాడీలు పెరగడానికి కారణం అవుతాయన్నారు. యాంటీ బాడీలు పెంచేందుకు ప్రతిపాదిస్తున్న బూస్టర్ లేదా థర్డ్ డోస్ వాడకంపై టెస్టులు జరుగుతున్నాయని డాక్టర్ శరీన్ తెలిపారు.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సైతం సెప్టెంబర్ వరకైనా బూస్టర్ డోస్ వాడకం నిలిపేయాలని ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. కనీసం ప్రపంచ జనాభాలో 10 శాతం మందికైనా వ్యాక్సినేషన్ పూర్తి కావాలని పేర్కొంది. 400 కోట్ల మందికిపైగా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరగాలి. సంపన్న, అప్పర్ మిడిల్ ఇన్కం దేశాల్లో 80 శాతానికి పైగా జనాభా ఉన్నారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉంటారని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెసస్ పేర్కొన్నారు.
బూస్టర్ డోస్పై చర్చించడం కంటే ఇమ్యూనైజ్ చేయడంపైనే ద్రుష్టి పెట్టడం చాలా ముఖ్యం అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కే శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. తీవ్ర ఇన్ఫెక్షన్, మరణం నుంచి రక్షణ పొందడానికి సింగిల్ డోస్ గణనీయ రక్షణ కల్పిస్తుందన్నారు. ఇప్పటి వరకు సుమారు 50 కోట్ల మందికి సింగిల్ వ్యాక్సినేషన్ జరిగింది.