Hot Chocolate | హాట్ చాక్లెట్ (Hot Chocolate) కారణంగా విమానంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన విస్తారా విమానం (Air Vistara)లో ఆగస్టు 11వ తేదీన చోటు చేసుకుంది. ఈ విషయంలో విస్తారా సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆ పాప తల్లి సోషల్ మీడియా ద్వారా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఘటనపై ఎయిర్ హోస్టెస్, సిబ్బంది తమకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని ఆరోపించింది.
రచనా గుప్తా (Rachna Gupta) అనే మహిళ తన పదేళ్ల కుమార్తెతో కలిసి ఢిల్లీ (Delhi) నుంచి ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) వెళ్లే విస్తారా విమానం ఎక్కారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రచనా తన కుమార్తె కోసం హాట్ చాక్లెట్ను ఆర్డర్ చేశారు. దీంతో క్యాబిన్ సిబ్బంది చిన్నారికి వేడిపానీయాన్ని తీసుకొచ్చారు. అయితే, అది సర్వ్ చేస్తున్న క్రమంలో పొరపాటు కారణంగా ఆ వేడి పానీయం చిన్నారిపై పడింది. దీంతో ఆ పాప చర్మం ఎర్రగా కందిపోయింది. దీనిపై చిన్నారి తల్లి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఎయిర్హోస్టెస్ వల్ల తన పదేళ్ల పాపకు కాలిన గాయాలైనట్లు తెలిపింది. ఈ విషయంలో సిబ్బంది సరిగా వ్యవహరించలేదని, ఎయిర్ హోస్టెస్ కనీసం తమకు క్షమాపణలు కూడా చెప్పలేదని ఆరోపించింది. ప్రథమ చికిత్స చేయించి కొత్త ప్రదేశంలో తమను ఓ అంబులెన్స్లో పంపించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. లగేజ్ను తరలించే విషయంలో కూడా వారు ఎలాంటి సాయం చేయలేదని పేర్కొంది. వైద్య ఖర్చులు మొత్తం తామే చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
అయితే, ఈ ఘటనపై విస్తారా స్పందించింది. ‘ఆగస్టు 11వ తేదీన ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్కు వెళ్తున్న యూకే25 విమానంలో ఓ దురదృష్టకర సంఘటన జరిగిందని మేము ధృవీకరిస్తున్నాము. వేడి పానీయం ఓ చిన్నారి శరీరంపై చిందటం వల్ల గాయాలు అయ్యాయి. మా క్యాబిన్ సిబ్బంది ఆమె (రచన) అభ్యర్థన మేరకు చిన్నారికి హాట్ చాక్లెట్ అందించారు. ఆ వేడి పానీయాన్ని సర్వ్ చేస్తున్న క్రమంలో చిన్నారి కదలడం వల్ల అది చేయిజారి పడిపోయింది. ఎయిర్లైన్స్ ప్రామాణిక పద్ధతులను అనుసరించి మా సిబ్బంది బాలిక గాయానికి ప్రథమ చికిత్స చేశారు. విమానం ఫ్రాంక్ఫర్ట్లో ల్యాండ్ అయ్యే వరకూ పారామెడికల్ సిబ్బంది పాప పరిస్థితిని పర్యవేక్షించారు. ఆ తర్వాత ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి, ఆసుపత్రికి తరలించాం. అప్పటి నుంచి వారితో టచ్లోనే ఉన్నాం. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. వైద్య ఖర్చులు కూడా చెల్లిస్తామని వారికి తెలిపాము’ అని విస్తారా ఓ ప్రకటనలో వెల్లడించింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ సేవలను మెరుగుపర్చుకుంటామని విస్తారా తెలిపింది. ప్రయాణికుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొంది.
Also Read..
Boat Capsize | ఘోర ప్రమాదం.. వలసదారులతో వెళ్తున్న పడవ మునిగి 63 మంది మృతి
TS Weather Update | రేపట్నుంచి రాష్ట్రంలో వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
Sonam Kapoor | సోనమ్ కపూర్ పెట్టిన పోస్టు రానా దగ్గుబాటి గురించేనా? వాళ్ల మధ్య అసలు వైరమేంటి?