శ్రీనగర్ : రాబోయే పది రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని మాజీ కేంద్రమంతి, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ప్రకటించారు. ఆదివారం బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆజాద్.. ఆ తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపుగా 50 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్లో కొనసాగారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏలో పలుసార్లు కేంద్రమంత్రిగా, 2005 నుంచి 2008 వరకు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగాను సేవలందించారు. ఇంతకు ముందు జమ్మూలో జరిగిన బహిరంగ సభలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీకి ఇంకా పేరు పెట్టాలేదని, జమ్మూ కశ్మీర్ ప్రజలే పార్టీ పేరు, జెండాను నిర్ణయిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగేలా పార్టీకి హిందుస్థానీ పేరు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా, స్థానికులకు ఉపాధి తదితర అంశాలపై పార్టీ పోరాడుతుందన్నారు.