శ్రీనగర్ : కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆయన.. కొత్త పార్టీని ప్రకటించారు. తన స్వస్థంలో జమ్మూలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు ఉదయం ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన ఆయన.. సత్వారి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ జమ్మూకశ్మీర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు వచ్చి.. ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సైనిక్ ఫామ్స్ వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరించి.. తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా నా గుండె చప్పుడులో నివసిస్తున్నారన్నారు.
తన పార్టీకి ఇప్పుడు ఇంకా పేరును నిర్ణయించలేదని, పార్టీ పేరు, జెండా గుర్తులను ప్రజలే నిర్ణయిస్తారన్న ఆయన.. అందరికీ అర్థమయ్యే హిందుస్థానీ పేరునే పార్టీకి పెడుతామన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ రక్తం, చెమటలతో తయారైందన్నారు. ప్రస్తుతం కొందరు తనను అగౌరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ప్రయత్నాలన్నీ కంప్యూటర్లు, ట్వీట్లకే పరిమితమన్నారు. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కనిపించకపోవడానికి కారణం అదేనన్న ఆయన.. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు బస్సుల్లో జైలుకు వెళ్తున్నారని.. డీజీపీ, కమిషనర్లకు ఫోన్ చేసి తమ పేర్లు రాయించుకొని గంటలో బయటకు వస్తున్నారన్న ఆజాద్.. అందుకే కాంగ్రెస్ పుంజుకోలేకపోతుందన్నారు. ఆజాద్ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టబమైన భద్రా ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీడీసీలు, బీడీసీ సభ్యులు సహా వేలాది మంది మద్దతుదారులు బహిరంగ సభ ప్రాంగణానికి తరలివచ్చారు.