రాంచీ, జనవరి 25: ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకాలు.. ఇంకోవైపు ఊసేలేని ఉద్యోగాల భర్తీ.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను సాగనంపే చర్యలు చేపట్టింది కేంద్రంలోని బీజేపీ సర్కారు. పొమ్మనలేక పొగబెట్టేలా వ్యవహరిస్తున్నది. అందుకు ఉదాహరణే.. హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవటం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఈసీలో దాదాపు 1,300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. భారత పరిశోధనా సంస్థ (ఇస్రో) కోసం లాంచ్ ప్యాడ్ను తయారుచేసిన ఘనత ఈ సంస్థ సొంతం. కానీ, సంస్థ ఉద్యోగులకు ఏడాది కాలంగా జీతాలు ఇవ్వటం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. జీతాలు రాక పిల్లల చదువులకు ఇబ్బంది అవుతున్నదని, ఇల్లు పూట గడవటం కూడా కష్టంగా మారిందని హెచ్ఈసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే పండ్లు, ఛాయ్ అమ్ముకొని కుటుంబాలను పోషించుకొంటున్నారు. జీతాల కోసం హెచ్ఈసీ వర్కర్లు, ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడి ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ప్రేమ్ శంకర్ పాశ్వాన్ మాట్లాడుతూ.. జీతాలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ డీవై చంద్రచూడ్కు లేఖ రాశామని తెలిపారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే ఫిబ్రవరిలో కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నామని వెల్లడించారు. ఉద్యోగులకు 15 నెలల నుంచి, వర్కర్లకు 12 నెలల నుంచి జీతాలు రావటం లేదని వివరించారు. ఉద్యోగుల సమస్యపై బీహెచ్ఈఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఈసీ సీఎండీ-అడిషనల్ ఇన్చార్జి)ను వివరణ కోరగా ఎలాంటి స్పందన రాలేదు.
జీతం చూసి ఏడాది దాటింది. డబ్బుల్లేక నా తల్లికి వైద్యం చేయించలేకపోయా. దీంతో ఆమె చనిపోయింది. నా సీనియర్ ఉద్యోగి భార్య చనిపోతే శవాన్ని మోసుకెళ్లే వాహనానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. దీంతో కారు ఢిక్కీలో మోసుకెళ్లాడు. దుకాణాల్లో ఉద్దెరకు నిత్యావసరాలు కూడా ఇస్తలేరు. ఫీజులు కట్టలేక మా పిల్లలను స్కూలుకు పంపటం లేదు.
– శశికుమార్, డిప్యూటీ మేనేజర్, హెచ్ఈసీ