ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ను బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కలిశారు (Gautam Adani meets Sharad Pawar). ముంబైలోని శరద్ పవార్ నివాసంలో గురువారం కలిసిన ఆయన సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. అదానీ గ్రూప్లో ఆర్థిక అవకతవకలు, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్లను ఆరోపిస్తూ హిండెన్బర్గ్ విడుదల చేసిన రీసెర్చ్ నివేదిక దేశంలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలుస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను ఆయనకు కట్టబెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అలాగే అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై హిండెన్బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగకుండా ముగిశాయి.
కాగా, అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలన్న కాంగ్రెస్ డిమాండ్ను శరద్ పవార్ ఇటీవల తప్పుపట్టారు. పార్లమెంట్లో రాజకీయ బలం ఆధారంగా జేపీసీ ఏర్పడుతుందని తెలిపారు. దీంతో బీజేపీ సభ్యులే కమిటీలో ఎక్కువ మంది ఉంటారని, దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. దీనికి బదులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని బృందంతో విచారణ జరిపిస్తే మంచిదని అన్నారు. అలాగే దేశంలోని ప్రతిపక్షాలు గతంలో టాటా, బిర్లా సంస్థలను టార్గెట్ చేసినట్లుగా ప్రస్తుతం అదానీ, రిలయన్స్ సంస్థలను కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకోవడం మంచిదికాదన్నారు. దేశ అభివృద్ధికి మూలమైన పారిశ్రామిక సంస్థలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. హిండెన్బర్గ్ సంస్థపైనా మండిపడ్డారు. అయితే ప్రతిపక్షాల ఐక్యత కోసం అదానీ గ్రూప్పై జేపీసీ డిమాండ్ను తాను వ్యతిరేకించబోనని అన్నారు.
మరోవైపు స్టాక్ మార్కెట్ల నియంత్రణను పరిశీలించి అవసరమైన సిఫార్సులు, సూచనలు చేసేందుకు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు గత నెలలో ఏర్పాటు చేసింది. అయితే అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని బృందంతో విచారణ జరిపిస్తే మంచిదన్న శరద్ పవార్ గతవారం ఆ డిమాండ్ నుంచి వెనక్కి తగ్గారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం గౌతమ్ అదానీ స్వయంగా శరద్ పవార్ ఇంటికి వెళ్లి ఆయనను కలువడం, రెండు గంటలకుపైగా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకున్నది.
Also Read: