న్యూఢిల్లీ, జూలై 23: పేదలకు వంటగ్యాస్ సబ్సిడీపై మోదీ సర్కారు చెప్పినవన్నీ దొంగ మాటలేనని తేలిపోయింది. సబ్సిడీలను ఎత్తేయటంలేదని, అసలైన లబ్ధిదారులకే సబ్సిడీ వచ్చేలా చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పినవన్నీ కల్లబొల్లి మాటలేనని పార్లమెంటు సాక్షిగా బయటపడింది. కేంద్రం వివిధ పథకాల ద్వారా పేదలకు ఇస్తున్న ఎల్పీజీ సబ్సిడీ ఏటేటా ఎంత తగ్గుతున్నదో కేంద్ర మంత్రి రామేశ్వర్ తెలీ పార్లమెంటులో స్వయంగా వెల్లడించారు. 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.37,209 కోట్లు ఉన్న వంటగ్యాస్ సబ్సిడీ 2022కు వచ్చేసరికి 242 కోట్లకు తగ్గిపోయిందని తెలీ శనివారం పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పెట్రోల్, డీజిల్లాగే వంటగ్యాస్ సిలిండర్ ధరలను కూడా గతంలో ప్రభుత్వాలే నిర్ణయించేవి. కట్టెల పొయ్యి వాడకాన్ని తగ్గించి వంటగ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పేదలకు సిలిండర్పై సబ్సిడీ ఇచ్చేది. మార్కెట్ ధరలకు పేదలు సిలిండర్ కొనలేరు కాబట్టి.. దానికి కొంత ధర నిర్ణయించి అధిక ధరా భారాన్ని కంపెనీలకు ప్రభుత్వం చెల్లించేది. సబ్సిడీలకు మంగళంపాడే విధానాన్ని యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టగా, మోదీ సర్కారు దానిని పరిపూర్ణం చేసే దిశగా నడుస్తున్నది. సబ్సిడీ సొమ్మును కంపెనీలకు ఇచ్చే బదులు లబ్ధిదారుడి ఖాతాలోనే నేరుగా వేసేలా నిబంధనలు మార్చారు. అంటే మార్కెట్ రేటు ప్రకారం వినియోగదదారుడు సిలిండర్ కొనుగోలు చేయాలి. దానిపై కేంద్రం కొంత సబ్సిడీ నిర్ణయించి వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో వేస్తుంది. అయితే, సిలిండర్కు బహిరంగ మార్కెట్లో ఈ విధానాన్ని కూడా మోదీ సర్కారు ఎత్తేసింది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (పీఎంయూవై) పథకం లబ్ధిదారులకు మాత్రమే రూ.200 సబ్సిడీ ఇస్తామని గత మే 28న ప్రకటించింది. దీంతో ఇక వంటగ్యాస్ సబ్సిడీ నామమాత్రమేనని చెప్పకనే చెప్పింది.