శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఎల్వీఎం3 వాహకనౌక ద్వారా ఒకేసారి 36 ఇంటర్నెట్ శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లోకి చేర్చింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు 5,805 కిలోల పేలోడ్తో ఈ వాహక నౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. అంతకుముందు 24.30 గంటల పాటు ఇందుకు కౌంట్డౌన్ జరిగింది. బ్రిటన్ సంస్థ వన్వెబ్ గ్రూప్నకు చెందిన 72 శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లోకి పంపించేందుకు గానూ ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి విడతగా గత ఏడాది అక్టోబరు 23న 36 శాటిలైట్లను తీసుకెళ్లగా రెండో విడతగా ఆదివారం మిగతా 36 శాటిలైట్లను మోసుకెళ్లింది. ఈ 36 శాటిలైట్ల నుంచి సిగ్నళ్లు అందుతున్నాయని వన్వెబ్ సంస్థ ధృవీకరించింది. ఈ మిషన్ విజయవంతం అయిన నేపథ్యంలో ఎన్ఎస్ఐఎల్, ఇస్రో, వన్వెబ్ సంస్థలకు ప్రధాని మోదీ, ఇస్రో చైర్మన్ సోమనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.
గగన్యాన్కూ ఇవే మోటార్లు!
ఎల్వీఎం3 సమర్థంగా పని చేయడం గగన్యాన్ ప్రయోగానికి కూడా ఊతమిచ్చింది. ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపేందుకు ఇస్రో గగన్యాన్ మిషన్ను చేపట్టింది. 2024 చివరలో ఈ ప్రయోగం చేపట్టనుంది. ఇందులో వినియోగించాలనుకుంటున్న ఎస్200 మోటార్లనే ఎల్వీఎం3 రాకెట్లో వినియోగించారు. ఎస్200 మోటర్లను గగన్యాన్ ప్రయోగం కోసం అవసరమైన విధంగా తయారుచేశామని, ఇవి ఎల్వీఎం3లో సమర్థంగా పని చేయడం సంతోషకరమని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఎల్వీఎం3 తాజా మిషన్ విజయవంతం కావడంతో గగన్యాన్కు సిద్ధమవుతున్న శాస్త్రవేత్తల్లో ైస్థెర్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.