న్యూఢిల్లీ, ఆగస్టు 17: బీజేపీలో వ్యవస్థీకృత మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా పార్టీలో కీలకమైన పార్లమెంటరీ బోర్డుతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీని బుధవారం పునర్వ్యవస్థీకరించారు. పార్లమెంటరీ బోర్డు నుంచి బీజేపీ కీలక నేతలైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్లను తప్పించారు. కొత్తగా ఆరుగురిని చేర్చుకున్నారు. వీరిలో కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప, సుధాయాదవ్, సత్యనారాయణ జతియా, కె లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా ఉన్నారు. పార్లమెంటరీ బోర్డులో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులు ఉంటారు.
ఇక బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలోకి కొత్తగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్లను తీసుకువచ్చారు. పార్లమెంటరీ బోర్డులో ఉన్నవారందరూ ఎలక్షన్ కమిటీలో కూడా సభ్యులుగా ఉంటారు. అయితే బోర్డులో యోగి ఆదిత్యనాథ్కు చోటు దక్కలేదు. మరోవైపు పార్టీ పెట్టుకున్న వయోపరిమితికి భిన్నంగా 75 ఏండ్లకు పైగా వయసున్న యెడియూరప్ప, జతియాలను బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకోవడం గమనార్హం.