DGCA : విమాన ప్రయాణికులకు ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)’ శుభవార్త చెప్పింది. టికెట్ రద్దు, రిఫండ్లకు సంబంధించి సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ (CAR) ను సవరిస్తూ కీలక మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన 48 గంటల లోపు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే టికెట్ను రద్దు చేసుకోవచ్చు లేదా మార్పులు చేసుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలు మార్చి 26 నుంచి అమల్లోకి రానున్నాయి.
కానీ ఈ ‘లుక్-ఇన్’ పీరియడ్ సదుపాయానికి కొన్ని షరతులు వర్తిస్తాయి. దేశీయ విమాన ప్రయాణానికి కనీసం 7 రోజుల ముందు, అంతర్జాతీయ ప్రయాణానికి 15 రోజుల ముందు బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. కేవలం ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్ ద్వారా నేరుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ వేరే విమానానికి టికెట్ మార్చుకుంటే ఛార్జీల వ్యత్యాసాన్ని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే 48 గంటలు దాటిన తర్వాత సాధారణ రద్దు ఛార్జీలు వర్తిస్తాయని డీజీసీఏ స్పష్టంచేసింది. టికెట్లపై పేరు తప్పుగా పడితే బుక్ చేసిన 24 గంటల్లోపు తెలియజేస్తే ఎలాంటి రుసుము లేకుండా సరిచేసుకోవచ్చని తెలిపింది. ఇక రిఫండ్ల విషయంలోనూ డీజీసీఏ స్పష్టత ఇచ్చింది. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్ల రిఫండ్ బాధ్యత కూడా విమానయాన సంస్థలదేనని, 14 రోజుల్లోగా ఆ మొత్తాన్ని వాపసు ఇవ్వాలని ఆదేశించింది.
క్రెడిట్ కార్డ్ చెల్లింపుల రిఫండ్ను 7 రోజుల్లో, ఆఫీసులో నగదు చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలని డీజీసీఏ పేర్కొన్నది. బేస్ ఫేర్ నాన్-రిఫండబుల్ అయినప్పటికీ.. పన్నులు, ఇతర ఛార్జీలను తప్పనిసరిగా వాపసు ఇవ్వాలని చెప్పింది.