న్యూఢిల్లీ, జూన్ 1: ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ వినియోగిస్తున్న దేశాల్లో భారత్లోనే వాటి ధరలు అధికంగా ఉన్నట్టు ఓ వెబ్సైట్ వెల్లడించింది. దేశ సగటు తలసరి ఆదాయంతో సమానంగా సంపాదించే భారతీయుడు తన ఒకరోజు వేతనంతో కేవలం ఎనిమిది లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ మాత్రమే కొనుగోలు చేయగలడు. ప్రపంచంలోని పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్లో ఇది అత్యంత తక్కువ పరిమాణం అని ఓ ఆంగ్ల దినపత్రిక పేర్కొన్నది. ఇదే సమయంలో సగటు అమెరికన్ తన ఒక రోజు సంపాదనతో 199 లీటర్ల పెట్రోలు, 171 లీటర్ల డీజిల్ కొనుగోలు చేయగలడని వివరించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇంధన ధరలను వెల్లడించే గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్ ఆధారంగా ఈ గణాంకాలను అంచనా వేసినట్టు ఆ పత్రిక వివరించింది. భారత్తో పోల్చుకుంటే ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, జపాన్కు చెందిన పౌరులు తమ ఒక రోజు వేతనంతో 50 లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ కొనుగోలు చేయగలరని తెలిపింది.
ప్రపంచంలోని పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 9వ స్థానంలో ఉన్న బ్రెజిల్లో సైతం భారత్ కన్నా పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయి. ఓ సగటు బ్రెజిలియన్ తన రోజువారీ వేతనంతో 20 లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ కొనుగోలు చేయగలడని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 158 దేశాల్లో లిబియాలో మాత్రమే ఇంధన ధరలు అతి తక్కువగా ఉన్నట్టు తెలిపింది. లిబియా పౌరుల తమ రోజువారీ ఆదాయంతో 789 లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ కొనుగోలు చేయగలరని పేర్కొన్నది. ఇక డీజిల్ అత్యంత చౌకగా లభించే దేశాల్లో వెనిజువెలా మొదటి స్థానంలో ఉండగా, ఇరాన్ రెండో స్థానంలో ఉన్నది. వెనిజువెలాలో ఒకరోజు కూలీతో 2,573 లీటర్లు, ఇరాన్లో 1,866 లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చని తెలిపింది. చమురు ఉత్పత్తి చేసే దేశాలైన కువైట్, వెనిజువెలా, ఖతార్, ఇరాన్, లిబియాలో ఒకరోజు జీతంతో 200 లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ కొనుగోలు చేయవచ్చని వివరించింది.
ఇంధన ధరల మోత
గత రెండు నెలల కాలంలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడు విడతల్లో లీటరు పెట్రోలు లేదా డీజిల్పై రూ.7 పెంచింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు aధరలు పెరిగాయం టూ ఆ భారాన్ని దేశ ప్రజలపై మోపింది. నిజానికి ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో మూడు ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు రూ.19,470 కోట్ల లాభాలు ఆర్జించినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం కంటే 40.74 శాతం అధికమని తెలుస్తున్నది. మార్చి నెలలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న పరిస్థితుల్లోనే భారత్లోని మూడు కంపెనీలు వేల కోట్ల లాభాలను పొందినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అయినప్పటికీ చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయంటూ భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచివేసింది.