న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి చోటు దక్కించుకున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక ‘ఫోర్బ్స్’ తాజాగా విడుదల చేసిన 2023 జాబితాలో నలుగురు భారతీయులకు చోటు లభించింది.
వీరిలో భారత్ నుంచి నిర్మలా సీతారామన్ అగ్రస్థానాన్ని (32వ స్థానం) కైవసం చేసుకోగా.. హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా (60వ స్థానం), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్పర్సన్ సోమా మోండల్ (70వ స్థానం), బయోకాన్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా (76వ ర్యాంకు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. రోష్నీ నాడార్ అత్యంత సంపన్నురాలైన మహిళగా, మహాదాతగా గుర్తింపు పొందారు. సెయిల్ తొలి మహిళా చైర్మన్గా మోండల్ చరిత్ర సృష్టించారు. సంపన్న వ్యాపారవేత్తల్లో కిరణ్ మజుందార్ షా ఒకరు.