CM Arvind Kejriwal | హైదరాబాద్, మే 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కాంగ్రెస్తో తమ బంధం శాశ్వతమైనదేమీ కాదని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే కాంగ్రెస్తో తాము జట్టు కట్టినట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు జాతీయ మీడియా ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్తో ఆప్ది శాశ్వతమైన వివాహ బంధమేమీ కాదు. బీజేపీపాలనలో ప్రస్తుతం దేశంలో నియంతృత్వం, గూండాగిరీ రాజ్యమేలుతున్నాయి. వీటికి చరమగీతం పాడాలి. ఇది జరుగాలంటే బీజేపీని ఓడించాలి. అందుకే కాంగ్రెస్తో జట్టుకట్టాం’ అని కేజ్రీవాల్ అన్నారు. కొన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్తో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టిన ఆప్, పంజాబ్ తదితర రాష్ర్టాల్లో సొంతంగా బరిలోకి దిగడంపై కూడా ఆయన స్పందించారు. ‘దేశాన్ని కాపాడటం ప్రస్తుతం ఎంతో ముఖ్యం. ఇందులో భాగంగానే బీజేపీని ఓడించడానికి అవసరమైన చోట ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. పంజాబ్లో బీజేపీ ఉనికే లేదు’ అని పేర్కొన్న కేజ్రీవాల్.. అలాంటి సమయంలో కాంగ్రెస్తోనే తమకు పోటీ అని పరోక్షంగా బదులిచ్చారు.
ఢిల్లీ సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. మద్యం పాలసీ కేసు విషయమై ఆయన స్పందిస్తూ.. ‘నేను తిరిగి జైలుకు వెళ్తానా? లేదా? అనేది ఇక్కడ సమస్య కాదు. ప్రస్తుతం దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయింది. వాళ్లు (బీజేపీ) ఎంత కాలం నన్ను జైళ్లో పెట్టాలనుకొంటున్నారో.. పెట్టనివ్వండి. నేను నా ధైర్యాన్ని కోల్పోను. బీజేపీ కోరుకొంటున్నట్టు.. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయబోను’ అని పేర్కొన్నారు.
మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను బీజేపీ జైళ్లో పెడుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు. వ్లాదిమిర్ పుతిన్ పాలనలో రష్యాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ఇక్కడ కూడా అవే పునరావృతమవుతాయన్నారు. బీజేపీలో చేరితే బెయిల్ ఇప్పిస్తామని ఆప్ నేతలు సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియాకు ఆ పార్టీ నేతలు ఆశ చూపించారని మండిపడ్డారు.
బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే, ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ భవిష్యత్తుకు ముగింపు పలుకుతారని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. ‘నేను గతంలో చెప్పిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నా. ఈసారి పీఎంగా మోదీ మళ్లీ ఎన్నికైతే, యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితం డోలాయమానంలో పడుతుంది. నేను చెప్పింది తప్పని బీజేపీ నేతలను చెప్పమనండి?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాగా.. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వివాదంపై మాట్లాడటానికి కేజ్రీవాల్ నిరాకరించారు.