న్యూఢిల్లీ: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు అని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ను 2018లో ప్రవేశపెట్టన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్లపై స్టే విధించేందుకు ఎటువంటి కారణాలు కనిపించడం లేదని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ.. ఎలక్టోరల్ బాండ్లకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. కానీ ఎలక్టోరల్ బాండ్లను మాత్రం ఎన్నికల కమిషన్ స్వాగతించింది. ఒకవేళ బాండ్లు లేకుంటే ఎన్నికల సమయంలో నగదు రూపంలో ఎక్కువ లావాదేవీలు జరుగుతాయని ఈసీ చెప్పింది. బాండ్ల అంశంలో పారదర్శకత తీసుకువచ్చేందుకు ఎలక్టోరల్ బాండ్లను తీసుకువచ్చినట్లు ఎన్నికల కమిషన్ చెప్పింది. ఏడీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. అధికారంలో ఉన్న పార్టీకి విరాళం పేరుతో లంచాలు ఇచ్చేందుకు ఎలక్టోరల్ బాండ్లు ఉపకరిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి బాండ్లతో ఆర్థిక కుంభకోణాలు జరుగుతాయని ఆర్బీఐ చెప్పిన అంశాలను కూడా ఆయన కోర్టుకు తెలిపారు.