ప్రభుత్వ దవాఖానలకు వచ్చేవారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలి
వీలైనంత త్వరగా ఇంటింటికీ వైద్య పరీక్షలు పూర్తిచేయాలి
అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి
మేడ్చల్, మే5(నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. గురువారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలు, టీకాల కోసం ప్రభుత్వ దవాఖానలకు వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది విలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా దవాఖానలో ఆక్సిజన్, బెడ్ల సంఖ్యను పెంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారికి హోంఐసొలేషన్ కిట్లను అందజేయాలన్నారు. అధికారులు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, వైద్యాధికారి మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.