హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ సంస్థ ప్రారంభం తర్వాతే ఇక్కడ స్వాతంత్య్రోద్యమం ఊపందుకున్నదని మనకు ఇప్పటివరకూ తెలుసు. కానీ, జాతీయతా స్ఫూర్తికి 19వ దశకంలోనే బీజాలు పడ్డాయి. 1885లో కాంగ్రెస్ సంస్థ ఏర్పాటును అందరూ స్వాగతించారు. సంస్థానంలో సంస్థ మహా సభలు నిర్వహించగా, ఇక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ 1938లో ప్రారంభమైంది. ఆ తర్వాత నిషేధానికి లోనైంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, అంతకు ఎన్నో దశాబ్దాల ముందే హైదరాబాద్లో కాంగ్రెస్ స్థాపనకు బీజాలుపడ్డాయి. హైదరాబాద్కు 1880 నాటికే ఇతర ప్రాంతాలనుంచి విద్యావేత్తలు, మేధావులు, ఉన్నతోద్యోగులు వచ్చారు. వీరు ఇక్కడి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. స్వాత్రంత్య్ర కాంక్షను రగిల్చారు. ఇందులో డాక్టర్ అఘోరనాథ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూం, రామచంద్ర పిళ్లైలాంటివారు ప్రముఖులు. 1885లో కాంగ్రెస్ సంస్థ ఏర్పాటును వీరంతా మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఇందులో కొంతమంది అప్పటి కాంగ్రెస్ మహాసభల్లోనూ పాల్గొన్నారు.
హైదరాబాద్ సంస్థానంలో రామచంద్ర పిళ్లై మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్త. 1888 అక్టోబర్లో సికింద్రాబాద్లోని హెడ్ పోలీస్స్టేషన్ ఎదుట పెద్ద షామియానాలు వేసి కాంగ్రెస్ బహి రంగసభ కూడా నిర్వహించారు. ఈ సభకు రెండు వేలమంది హాజరుకావడం విశేషం. ఈ సభలో నాయకులు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసంగించారు. అలాగే, ‘హైదరాబాద్ రికార్డ్’లాంటి పత్రికలు ఇక్కడి ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించాయి. 1938 తర్వాత హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ సంస్థ క్రియాశీలకపాత్ర పోషించింది. సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ఆ సంస్థ నాయకులు చురుగ్గా పాల్గొన్నారు. టీ హయగ్రీవాచారి, పీవీ నరసింహారావులాంటివారు చాందా, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ముఖ్యపాత్ర నిర్వహించారు.