న్యూఢిల్లీ, జూలై 13: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం నుంచి అంటే జూలై 15 నుంచి 75 రోజుల పాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా అందజేయనున్నది. 18 ఏండ్లు నిండి, రెండు డోసులు పూర్తయిన వారికి అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా ఇస్తామని కేంద్ర సమచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. ఇప్పటివరకు దేశ జనాభాకు 199.12 కోట్ల డోసులు ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి 12 -14 ఏండ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించారు. కాగా, 18 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసును ఉచితంగా ఇవ్వాలంటూ తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలు చాలా కాలం నుంచి కేంద్రాన్ని కోరుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కూడా ఈ మేరకు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. చివరకు ఇంత ఆలస్యంగా మేలుకొని ఉచితంగా అందజేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది.