లక్నో: ఉత్తరప్రదేశ్లో (Uttar pradesh) నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతున్నది. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న తొమ్మిది జిల్లాల్లో రైతులు, సిక్కుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
కాగా, 2017 ఎన్నికల్లో ఈ 59 నియోజకవర్గాలకు గానూ బీజేపీ 51 స్థానాల్లో విజయం సాధించగా, ఎస్పీ 4, బీఎస్పీ 3, అప్నాదళ్ (సోనేలాల్) ఒక్క స్థానంలో గెలుపొందాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రైతులపై కారు దూసుకెళ్లిన ఘటజన జరిగిన లఖింపూర్ ఖీరీ ప్రాంతంలో కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగుతున్నది. దీంతోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ జిల్లాలో, స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఎంపీగా ఉన్న పిలిభిత్ నియోజకవర్గంలో కూడా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.