బఠిండా, ఏప్రిల్ 12: పంజాబ్లో బుధవారం కలకలం రేగింది. తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండా మిలటరీ స్టేషన్లో ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాల్పుల అనంతరం సాయుధులు ఘటనాస్థలి నుంచి పారిపోయారు. సమాచారం అందుకొన్న క్విక్ రెస్పాన్స్ బృందాలు ఆ ప్రాంతాన్ని వెంటనే తన ఆధీనంలోకి తీసుకొని కార్టెన్ సెర్చ్ చేపట్టాయి. మిలటరీ స్టేషన్ తలుపులు మూసేసి కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టాయి. సైనిక స్థావరంలోని ఆఫీసర్స్ మెస్ వద్ద ఈ కాల్పుల ఘటన చోటుచేసుకొన్నది. కాగా, ఈ దాడిలో ఉగ్రకోణం లేదని, బయటి నుంచి ఇది జరగలేదని పంజాబ్ ఏడీజీపీ పర్మార్ పేర్కొన్నారు. అంతర్గత విబేధాల కారణంగా కాల్పుల ఘటన జరిగిందని, ఇద్దరు వ్యక్తులు సాధారణ పౌరుల దుస్తుల్లో వచ్చి దాడి చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పంజాబ్ మంత్రి అన్మోల్ గగన్మాన్ మాట్లాడుతూ ‘ఇది అంతర్గత అంశంగా కనిపిస్తున్నది. ఎస్ఎస్పీతో ఇప్పటికే మాట్లాడాను. దర్యాప్తు కొనసాగుతున్నది’ అని పేర్కొన్నారు. దాడి ఘటనపై ఆర్మీ, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
దొంగిలించిన వాటితో కాల్పులు!
ఘటనాస్థలి నుంచి 19 ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకొన్నట్టు బఠిండా ఎస్పీ అజయ్గాంధీ తెలిపారు. రెండు రోజుల క్రితం ఒక ఇన్సాస్ రైఫిల్, 28 తూటాలు క్వార్టర్ గార్డ్ నుంచి కనిపించకుండాపోయాయి. ఆగంతకులు దాడికి వీటిని వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఘటనపై పంజాబ్ పోలీసులతో కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. దాడిలో నలుగురు మరణించారని, ఇంకెవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం జరుగలేదని తెలిపింది. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని పేర్కొన్నది. అటు బఠిండా సైనిక స్థావరంలో కాల్పులు ఘటనపై ఆర్మీ చీఫ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించారు.