Deaths : సెప్టిక్ ట్యాంకులో పేరుకుపోయిన బంగారం మడ్డిని బయటికి తీసుకురావడానికి లోపలికి వెళ్లిన నలుగురు కూలీలు అందులోనే ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్లోని ఓ జ్యుయెలరీ షాపు యజమాని వికాస్ మెహతా.. తమ సెప్టెక్ ట్యాంకులో పేరకుపోయిన బంగారం, వెండి మడ్డిని వెలికి తీయడానికి నలుగురు కూలీలను పురమాయించాడు.
జ్యుయెలరీ షాపులో రోజూ బంగారం, వెండిని సిబ్బంది ప్రాసెసింగ్ చేస్తుంటారు. ఈ ప్రాసెసింగ్ సమయంలో వెలువడే బంగారం, వెండి మడ్డిలో కొంత సెప్టిక్ ట్యాంక్లో పేరుకుపోయినట్లు మెహతా గుర్తించారు. దాన్ని బయటకు తీయడానికి సోమవారం అతడు ఎనిమిది మంది కూలీలను తీసుకొచ్చాడు. అయితే సెప్టిక్ ట్యాంకులో దిగేందుకు మొదట వారు నిరాకరించారు. అయితే వికాస్ మెహతా అదనంగా డబ్బులు ఇస్తానని ఆశ చూపడంతో చివరికి అంగీకరించారు.
సెప్టిక్ ట్యాంకులోకి దిగేటప్పుడు కూలీలు ఎలాంటి భద్రతా పరికరాలు తీసుకెళ్లకపోవడంతో ఘోరం జరిగింది. లోపలికి వెళ్లగానే ఊపిరాడక స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీయగా అప్పటికే ఉత్తరప్రదేశ్కు చెందిన రోహిత్ పాల్, సంజీవ్ పాల్, హిమాంగ్షు సింగ్, అర్పిత్ యాదవ్ అనే నలుగురు కూలీలు మృతి చెందారు. మిగతా నలుగురు కూలీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు.
ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా భూగర్భ సెప్టిక్ ట్యాంక్లోకి కార్మికులను పంపడంపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. అందులో నిజంగానే బంగారు రజను ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆభరణాల షాపు యజమాని, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనిపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచూ సంభవిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.