అరేబియా సముద్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)కు చెందిన ఒక హెలికాప్టర్.. అరేబియా సముద్రంలో ఉన్న సైట్ వద్దకు బయలు దేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ముంబై తీరానికి 50 నాటికన్ మైళ్ల దూరంలో ల్యాండ్ అవ్వాల్సిన రిగ్కు సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది.
ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో ఆరుగురు ఓన్జీసీ అధికారులు ఉండగా.. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, ఇద్దరు పైలట్లు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే దగ్గరలోని కోస్ట్గార్డ్ షిప్ ఘటనా స్థలానికి చేరుకుందని, మరో షిప్ ముంబై తీరం నుంచి బయలుదేరిందని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో నలుగురు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరణించిన వారిలో ముగ్గురు ఓన్జీసీ అధికారులు కాగా, మరొకరు కాంట్రాక్ట్ ఉద్యోగి అని సమాచారం.