మైసూరు: కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సిటీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. రెండు రోజులపాటు కుటుంబంలోని ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఇంటి తలుపులు విరగ్గొట్టి చూసిన పోలీసులకు నలుగురి మృతదేహాలు కనిపించాయి. నలుగురు కుటుంబసభ్యులూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మైసూరు పట్టణంలోని చాముండిపురం ఏరియాలో మహదేవస్వామి (45) అనే వ్యక్తి తన భార్య అనిత (38), కుమార్తెలు చంద్రకళ (17), ధనలక్ష్మి (15) తో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. రెండు నెలల క్రితమే వారు ఆ ఏరియాకు వచ్చి కూరగాయల దుకాణం నడుపుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ఇంట్లోంచి ఎవరూ బయటికి రాకపోవడం, కూరగాయల దుకాణం తెరువకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందు డోరు లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో వెనుక డోరును విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో మహదేవస్వామి, అతని భార్య, చిన్న కుమార్తె గోడలకు ఒరిగి కూర్చొని చనిపోయి ఉండగా, పెద్ద కుమార్తె ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.