న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఫిబ్రవరి 1, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జాతీయ రహదారులకు కేంద్రం మొండిచేయి చూపింది. బడ్జెట్లో ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. రాష్ట్రంలోని పలు రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసింది. ఇటీవల సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రాజెక్టులకు సైతం ఒక్కపైసా కూడా కేటాయించలేదు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పరిధిలోని చౌటుప్పల్ నుంచి షాద్నగర్ మీదుగా సంగారెడ్డి వరకు నిర్మించనున్న 181.87 కిలోమీటర్ల రోడ్డుకు ఒక్కపైసా కూడా విదల్చలేదు.మొత్తం 260 కిలోమీటర్ల నిడివి కలిగిన మూడు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పట్టించుకోలేదు. ఇందులో 165 కిలోమీటర్ల నిడివి గల కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం రహదారి, 70 కిలోమీటర్ల నిడివి గల కొత్తకోట-గూడూరు-మంత్రాలయం రహదారి, 25 కిలోమీటర్ల నిడివి గల జహీరాబాద్-బీదర్-డెగ్లూర్ రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు.సెంట్రల్ రోడ్ నెట్వర్క్ కింద రూ.804 కోట్లతో 44 రోడ్లను అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపిన కేంద్రం ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. ఈ బడ్జెట్లోనూ వాటి ఊసెత్తలేదు.
పీఎం గతి శక్తి పేరిట గారడీ
దేశ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చేందుకు ‘పీఎం గతి శక్తి’ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా నాలుగు చోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. గతిశక్తి ప్రణాళికను రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్టులు, పోర్టు, రవాణా, జలమార్గాలు, సరుకు రవాణా సదుపాయాలు వంటి ఏడు ఇంజిన్లు ముందుకు నడిపిస్తాయని చెప్పారు. బడ్జెట్లో హైవే సెక్టార్కు రూ.1.99 లక్షల కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.19 వేల కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ.20 వేల కోట్లు కేటాయించింది. గతేడాది రూ.19,500 కోట్లు ఇచ్చింది. గ్రామీణ అభివృద్ధి శాఖ కింద అమలయ్యే అన్ని రకాల కేంద్ర ప్రాయోజిత పథకాలకు 11 శాతం మేర కేటాయింపులు తగ్గించింది. కాగా, జాతీయ రహదారుల విషయంలో బీజేపీ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తున్నదని టీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్రెడ్డి ఆరోపించారు. 2014 నాటికి దేశంలో 90 వేల కి.మీ. జాతీయ రహదారులు ఉండగా, ఈ నెట్వర్క్ను 1.40 లక్షల కి.మీ.కు పెంచినట్లు తెలిపారు. ఇందులో 49,087 కి.మీ. రాష్ట్ర రహదారులనే జాతీయ రహదారులుగా నోటిఫై చేశారని పేర్కొన్నారు.
క్లుప్తంగా పీఎం గతి శక్తి..