ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి స్థానిక కోర్టు 11 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఘటనకు సంబంధించి పోలీసులు ఈ 11 రోజులపాటు నిందితులను ఇంటరాగేట్ చేయనున్నారు. కాగా, ఈ ఏడాది మే నెలలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో గురువారం బయటికి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభలు దద్ధరిల్లాయి. ప్రధాని మోదీ స్పందించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా కేసును సుమోటాగా స్వీకరించి సత్వర దర్యాప్తునకు పూనుకుంది. ఈ నేపథ్యంలో నేరం చేసి కూడా ఇన్నాళ్లూ స్వేచ్ఛగా తిరుగుతున్న నలుగురు నిందితులను మణిపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంరతరం వాళ్లను స్థానిక కోర్టులో హాజరుపర్చగా ఆ కోర్టు నిందితులకు 11 రోజుల పోలీస్కస్టడీ విధించింది.