న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని భ్రష్టుపట్టిస్తుందని యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషి ఆరోపించారు. కాషాయపార్టీని మట్టికరిపించేందుకు విపక్షాలు ఒకే వేదికపైకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ జీర్ణించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
ఈ దేశాన్ని కాపాడాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, బీజేపీని ఓడించాలని పిలుపు ఇచ్చారు. అన్ని పార్టీలు ఏకమైతేనే కాషాయపార్టీని ఓడించడం సాధ్యమవుతుందని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే దేశంలో ఏమీ మిగల్చరని, అప్పటికి దేశాన్ని మొత్తం అమ్మేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ముస్లింలను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వారిని శత్రువులుగా చూస్తోందని మండిపడ్డారు.దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు కీలక పాత్ర పోషించారని చెప్పారు.