భోపాల్: ‘టీచర్ ఎలా ఉన్నారు?’ అని పూర్వ విద్యార్థులు అడిగారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు (Students Fire at Teacher). అక్కడున్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గిర్వార్ సింగ్ అనే వ్యక్తి జౌరా రోడ్ ప్రాంతంలో ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ట్యూషన్కు వచ్చే విద్యార్థులకు ఆయన టీచింగ్ చేస్తున్నాడు. ఇద్దరు విద్యార్థులు మూడేళ్ల కిందట 12వ తరగతి పరీక్షల వరకు ఆ ట్యూషన్ సెంటర్లో చదివారు. అయితే కొంత ట్యూషన్ ఫీజులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో ఆ పూర్వ విద్యార్థులు కనిపించినప్పుడల్లా పెండింగ్ ట్యూషన్ ఫీజుల గురించి గిర్వార్ సింగ్ అడిగేవాడు. దీనిపై ఆగ్రహం చెందిన యువకులు ఆ ట్యూషన్ టీచర్పై దాడి చేయాలని ప్లాన్ వేశారు.
కాగా, బుధవారం ఆ ఇద్దరు యువకులు ట్యూషన్ సెంటర్ వద్దకు బైక్పై వచ్చారు. ట్యూషన్ టీచర్ గిర్వార్ సింగ్ను బయటకు పిలిచారు. ‘ఎలా ఉన్నారు? ట్యూషన్ సెంటర్ నిర్వహణ ఎలా ఉంది?’ అని అడిగి యోగక్షేమాలు ఆరా తీశారు. టీచర్ గిర్వార్ సింగ్ కూడా వారితో సాధారణంగానే మాట్లాడాడు. అయితే బైక్ వెనుక కూర్చొన్న యువకుడు మెల్లగా తన వద్ద ఉన్న నాటు తుపాకీని బయటకు తీసి టీచర్ గిర్వార్ సింగ్ కడుపులో కాల్పులు జరిపాడు. అనంతరం వారిద్దరూ బైక్పై అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు తుపాకీ కాల్పుల్లో గాయపడిన టీచర్ గిర్వార్ సింగ్ను అక్కడున్న వారు తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గ్వాలియర్లోని హాస్పిటల్లో ఆయనను అడ్మిట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ టీచర్ను ఆరా తీశారు. అయితే ఆ పూర్వ విద్యార్థులు తనపై ఎందుకు కాల్పులు జరిపారో తెలియదని చెప్పాడు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కాగా, పూర్వ విద్యార్థులు టీచర్పై కాల్పులు జరిపిన ఈ సంఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Video| Students Talk Normally With Their Former Teacher, Then Fire At Him pic.twitter.com/3znpHTtXEO
— NDTV (@ndtv) June 23, 2023