ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కంటే కాంగ్రెస్ అత్యంత ఘోరమైన ఓటమే చర్చనీయాంశంగా మారింది. బీజేపీపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో కాంగ్రెస్ విఫలమవడంతో.. ఆ పార్టీపై నమ్మకం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లకు ప్రస్తుతం ఏడుపొక్కటే తక్కువ. లాక్డౌన్ సమయంలో ప్రజలకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ సోదరి మాళవిక కూడా రాజకీయ అరంగేంట్రం కోసం అత్యంత వృద్ధ పార్టీ అయిన కాంగ్రెస్ను ఎంచుకుంది. దాని పరిణామాలను అనుభవించింది.
యూపీలో మాజీ ‘మిస్ బికినీ ఇండియా’గా గెలిచిన అర్చనా గౌతమ్ పరిస్థితి కూడా అలాంటిదే. ఆమెకు టికెట్ ఇచ్చినప్పుడే కొంతమంది గొడవలు చేశారు. కానీ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాళ్ల వాదనలు వినకుండా అర్చనకు టికెట్ ఇచ్చారు. అయినా ఆమె గెలవలేదు.
దీనిపై స్పందించిన అర్చన.. ‘‘హస్తినాపురం ప్రజలు నా మీద చాలా ప్రేమ చూపించారు. వాళ్ల నమ్మకాన్ని పొందలేకపోయాను అంతే. త్వరలోనే వాళ్ల నమ్మకాన్ని కూడా పొందుతాను’’ అని ధీమా వ్యక్తం చేసింది. అక్కడితో ఆగకుండా ‘‘ఒక్కసారి కూడా పడకుండా ఎవరికీ నడవడం రాదు కదా.. తల్లి కడుపులోనే ఎవరూ అది నేర్చుకోలేరు’’ అని పేర్కొంది.